అలా జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

రాష్ట్రంలోని 5 కోట్ల మంది కన్నెర్ర చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు బయట కూడా తిరుగలేరని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 20వ తేదీన అసెంబ్లీలో బిల్లు పెడితే కొత్త రాజధాని వస్తుందని సీఎం భావిస్తున్నారని.. కానీ అది జరగదని స్పష్టం చేశారు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారన్న విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోతోందంటూ మండిపడ్డారు.
అమరావతిపై రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ప్రజలు 3 రాజధానులు కోరుకుంటున్నారా? లేక అమరావతే కావాలనుకుంటున్నారా అన్నది తేలిపోతుందని చెప్పారు. ఇదే అజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. వైసీపీ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు చంద్రబాబు. తుళ్లూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు.. ఉద్యమం కోసం జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఇకపై హలో, గుడ్మార్నింగ్కు బదులుగా ప్రజలంతా జై అమరావతి అని పలకరించుకోవాలని సూచించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com