కీలక నిర్ణయాల దిశగా జరగనున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్

బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10.30 గంటలకే కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్ ఇవ్వాలనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూడు జతల యూనిఫాంలు, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు మంత్రి వర్గం ముందు రానున్నాయి.
ఇక.. ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు అంశంపైనా.. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలని ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ఇక .. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుపైనా చర్చించనుంది మంత్రివర్గం. అటు.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనతో పాటు.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటపైనా మంత్రివర్గం చర్చిస్తుంది. ఈ కార్పొరేషన్ ద్వార 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చలు జరపనుంది మంత్రివర్గం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com