తిరుమలకు తగ్గిన భక్తుల తాకిడి
తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావంతో అందరిలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో పుణ్యక్షేత్రాల దర్శనాలకు వచ్చేవారు బాగా తగ్గిపోయారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలతోపాటు కాళహస్తిలోనూ భక్తులు లేక ఆలయం బోసిపోయి కనిపిస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం అరగంటలోనే పూర్తవుతోంది. కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా రక్షణ చర్యలు చేపట్టినట్టు TTD అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. TTD అధికారులతో కలిసి వైకుంఠం క్యూలైన్లలను పరిశీలించిన ఆయన.. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై కొన్ని సూచనలు చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చూస్తూ టైమ్స్లాట్ విధానంలో టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటురోగ నివారణ మందులతో క్యూలైన్లు శుభ్రం చేస్తున్నారు. శ్రీవారి ఆలయం, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లు సహా అన్ని చోట్లా పరిశుభ్రతకు ప్రాధాన్యతమిస్తూనే, భక్తుల్లోనూ అవగాహన పెంచేందుకు కార్యక్యక్రమాలు చేపట్టారు. అనారోగ్యంతో ఉన్నవారు తిరుమల రాకుండా ఉండడం అందరికీ మంచిదని ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com