కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం

కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌, ఎర్రబెల్లి తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులను ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన కొంతమంది విదేశియులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నియంత్రణ పద్ధతులను విస్తృతంగా చర్చిస్తారు.

విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలన్నారు. స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుండి వచ్చిన వారు పరీక్షల తర్వాతే ఇళ్లకు పంపాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ఇప్పటికే 15రోజుల కార్యాచరణ, వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తోంది. గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమి గూడే కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా వుండాలని కేసిఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు.

Tags

Next Story