Update : జనతా కర్ఫ్యూ సారాంశం ఇది
Update : ఇంతకు ముందు 'జనతా కర్ఫ్యూ సారాంశం ఇది' అని మేము చేసిన పోస్ట్ లో.. కరోనా వైరస్ సాధారణ వాతావరణంలో 10 నుంచి 12 గంటలు మాత్రమే బతకగలుగుతుంది అని రాయటం జరిగింది. కాని కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ, PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారు కరోనా వైరస్ 12 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది అనడానికి ఎటువంటి ఆధారం లేదని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలాగే కొరోనా వైరస్ కొన్ని ఉపరితలాల (గ్లాస్ మరియు ప్లాస్టిక్) పై సుమారు 72 గంటల వరకు ఉంటుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై కొరోనా వైరస్ ఉండవచ్చని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వారు కూడా తెలిపారు. కావున ఇంతకు ముందు కరోనా వైరస్ సాధారణ వాతావరణంలో 10 నుంచి 12 గంటలు మాత్రమే బతకగలుగుతుంది అని మేము చేసిన పోస్ట్ తప్పు. గమనించగలరు.
కరోనా వైరస్పై అంకుశం ప్రయోగించేందుకు భారత జాతి యావత్తు సిద్ధమవుతోంది. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరు పాల్గొనాలంటూ నేతలు, సెలబ్రిటీలు సైతం పిలుపునిస్తున్నారు. అయితే.. ప్రపంచాన్ని గడగడాలడిస్తున్న వైరస్ను.. జనతా కర్ఫ్యూ ఎలా కట్టడి చేస్తుంది? కొందరిలో వస్తున్న సందేహమిది. అయితే.. కరోనా వైరస్ సాధారణ వాతావరణంలో 10 నుంచి 12 గంటలు మాత్రమే బతకగలుగుతుంది. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు సాగుతుంది.
ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలై.. రాత్రి 9 గంటల వరకు ఇళ్లు దాటి బయటకు రాకూడదన్నది నియమం. అంటే.. 14 గంటల పాటు.. ఏ ఒక్కరు, మరొకరిని కలిసే అవకాశం ఉండదు. అంటే.. కరోనా వైరస్ వ్యాప్తి చెయిన్ లింక్ను అలా తెగ్గొట్టేందుకు అవకాశం దొరుకుతుంది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. శనివారం రాత్రి నుంచే జనతా కర్ఫ్యూ మొదలుతున్నట్టు భావించాలి. ఆదివారం ఉదయం 7 నుంచి జనతా కర్ఫ్యూ మొదలయినా.. ముందురోజు రాత్రి అంతా ఇళ్లలోనే నిద్రపోతారు. మరోవైపు.. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత కూడా అంతా తమ తమ ఇళ్లలోనే నిద్రపోతారు. ఈ లెక్కన జనతా కర్ఫ్యూ.. ఓవరాల్గా 30 గంటలపైనే కొనసాగినట్టు అవుతుంది. సో.. ఆ కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోను బతికేందుకు అవకాశమే ఉండదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ను అంతం చేసేందుకు.. మన కోసం.. మనందరి కోసం.. ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలి. తెలియనివారికీ తెలియజెప్పాలి. ఒకవైపు.. జనతా కర్ఫ్యూ కొనసాగిస్తే.. మరోవైపు.. అధికార యంత్రాంగం తమ పనిని తాము విజయవంతంగా పూర్తి చేయగలుగుతుంది. కరోనా కేసులను ఇప్పటికే పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కరోనా రహిత ప్రపంచం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికీ అంతా జేజేలు పలకాలి. ఈ స్ఫూర్తిని దశదిశలా చాటి చెప్పాలి. అప్పుడే.. మహమ్మారి కోరల బారి నుంచి తప్పించుకోవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com