ఒడిశా సర్కార్ మరో కీలక నిర్ణయం.. మాస్క్ లేకుంటే పెట్రోల్ లేదు
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ నివారణ కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందలు పడకుండా రోజులో కొన్ని గంటల పాటు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కొనుగొలు చేసుకునే వెసులుబాటు కల్పించాయి. ఈ క్రమంలో ఒడిశా, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. ప్రజలు కరోనా బారినపడకుండా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి చేశాయి.
అయితే ఈ నిబంధనను ఒడిశా ప్రభుత్వంతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం శుక్రవారంనాడు 'నో మాస్క్, నో పెట్రోల్/డీజిల్/సీఎన్జీ' నిబంధన తీసుకువచ్చింది. ఆ ప్రకారం ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్లు ధరించకుండా వస్తే వారికి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ సౌకర్యం నిలిపేస్తారని ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ లథ్ శుక్రవారంనాడు భువనేశ్వర్లో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 పెట్రోల్ బంక్లు ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో వందలాది మంది ఉద్యోగులు ఎంతో రిస్క్ తీసుకుని విధులు నిర్వహిస్తున్నారని, నిబంధనలు పాటించని కస్టమర్ల వల్ల వారి జీవితాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయన్నారు. అందుకునే వినియోగదారులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అన్నారు. అయితే, మార్కెట్లో ఎన్-95 మాస్క్ల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు జేబు రుమాలతో ముక్కు, నోటిని కప్పుకునేందుకు ఒడిశా సర్కార్ అనుమతించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com