లాక్డౌన్ పొడిగింపు.. టీటీడీ కీలక నిర్ణయం
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 14వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిలుపుదల చేశారు. తాజాగా లాక్డౌన్ను దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి నిరాకరస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల దర్శనం మినహాయించి.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని టీటీడీ పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com