కరోనా వైరస్తో యుద్ధం.. చైనా ఆర్థిక వ్యవస్థ పతనం
ఒకపక్క కరోనా వైరస్ను కట్టడి చేయలేక మరో పక్క కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే మార్గం ఏదనే అన్వేషణలో ప్రస్తుతం చైనా పునరాలోచనలో పడింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే ఘోరమైన ఆర్థిక పరాజయాన్ని చైనా చవి చూసింది. వైరస్ వ్యాప్తిని నిర్మూలించే దిశగా లాక్డౌన్ చర్యలు చేపట్టిన నేపథ్యంలో అధిక శాతం ఫ్యాక్టరీలు, షాపులు మూతపడ్డాయి. ఈ ఏడాది చివరి నాటికైనా కోలుకుంటామో లేదో చెప్పలేని పరిస్థితి అని బీజింగ్లోని రుషి ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్కు చెందిన ఆర్థిక వేత్త హెచ్యూ జెన్సిన్ అన్నారు.
గత ఏడాది మొదటి త్రైమాసికంలో 80% చేసిన రిటైల్ వ్యయం, ఈ ఏడాది 19% శాతానికి పడిపోయింది. మార్చి ప్రారంభంలోనే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కార్యాలయాలు, కర్మాగారాలు తెరుచుకున్నాయి. కానీ రద్దీ ఎక్కువగా ఉండే సినిమా హాళ్లు, పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో చాలా వ్యాపారం నష్టపోవలసి వస్తుంది. ఇక పర్యాటకరంగం కూడా ఇంకా పుంజుకోవలసి ఉంది.
ఇతర దేశాలనుంచి చైనాకు వచ్చే ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు కారణం. విదేశీయులు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం కొనసాగుతోంది. దేశానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి కొన్ని నగరాల్లో షాపింగ్ వోచర్లను ఇవ్వడం, రెస్టారెంట్లు,ఫుడ్ కోర్టుల వంటి వాటిల్లో అధికారులు తినే దృశ్యాలను మీడియాల్లో చూపించినా వినియోగదారులు ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉన్నారు.
ఇక వాహన అమ్మకాలు గత ఏడాది కంటే 48.4%శాతం క్షీణించాయి. ఫిబ్రవరిలో మరీ దారుణంగా 81.7% కి పడిపోయింది. దిగుమతులు కూడా 6.6% తగ్గాయి. ఆక్స్ఫర్డ్ ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం ఈ సంవకత్సరం చైనాకు ఆర్థిక వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. అంటువ్యాధి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కాబట్టి కోలుకునే వేగం కూడా చాలా నెమ్మదిగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com