కిడ్నీ బాధితులపై దృష్టి పెట్టండి: చంద్రబాబు

రాష్ట్రంలో కిడ్నీ బాధితులపై శ్రద్ధ చూపాలని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కిడ్నీ బాధితుల గురించి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు చంద్రబాబు లేఖ రాశారు. లాక్డౌన్ వలన అనేక ప్రాంతాల్లోని కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోలేకపోతున్నారని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. డయాలసిస్ కేంద్రాల్లో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు జరపడంతో కిడ్నీ రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీని వలన కిడ్నీ రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం వస్తోందన్నారు. అదేవిధంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ రోగుల సమస్యను వెంటనే పరిష్కరించి.. సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com