కరోనాతో మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతి

కరోనాతో మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతి
X

దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం కొనసాగుతోంది. ఈ మహమ్మారి మహారాష్ట్రపై తన పంజా విసిరింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి. అందులోనూ ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అక్కడ పాజిటివ్‌ కేసులు పెరగడంతో పాటు మరణాలు ఆగకపోవడం ముంబైకర్లను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ మహమ్మారి బారినపడి మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందటం ఆందోళన రేకెత్తిస్తోంది. కోవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌కు గురై చికిత్స పొందుతున్న ముంబై పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు సోమవారం కన్నుమూశారు. మృతుడిని కుర్లా ట్రాఫిక్‌ డివిజన్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ 56 ఏళ్ల శివాజీ సోన్వానేగా గుర్తించారు. ముంబైలోని కరోనా ప్రధాన హాట్‌స్పాట్స్‌లో ఒకటైన ఎల్‌-వార్డ్‌ (కుర్లా డివిజన్‌)లో సోన్వానే విధులు నిర్వర్తించారు. శివాజీ సోన్వానే కోవిడ్‌-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని ముంబై పోలీస్‌ విభాగం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు పోలీసులు ప్రాణాల కోల్పోయారు. కరోనా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ వకోలా పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ పెండూకర్‌, కానిస్టేబుల్‌ సందీప్‌ సర్వ్‌లు కూడా గత రెండు రోజుల్లో మృతి చెందారు.

Tags

Next Story