కిరణా షాపు యజమానికి కరోనా.. వనస్థలిపురం రైతు బజార్ క్లోజ్..

కిరణా షాపు యజమానికి కరోనా.. వనస్థలిపురం రైతు బజార్ క్లోజ్..
X

హైదరాబాద్ నగరం పరిధిలోని వనస్థలిపురంలో కిరాణా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి సంబంధించిన మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకగా వారిలో తండ్రీ కొడుకులు మరణించారు. కిరాణా షాపులో సరుకులు కొనుగోలు చేసిన దాదాపు 169 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. కిరాణా షాపు యజమాని కిరాణాతో పాటు పాలు, కూరగాయలు కూడా విక్రయిస్తుంటారు. దాంతో షాపు నిత్యం రద్దీగా ఉంటుంది. దాదాపు రోజుకి 300 వందల మంది అతడి దగ్గర ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుంటారు.

ఇప్పుడు ఆయనకే కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడి స్థానికులతో పాటు, కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట నుంచే వీరికి వైరస్ వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే దుకాణదారుని కుమారుడు సూర్యాపేటలో పల్లీలు కొని సరూర్ నగర్ నూనె మిల్లులో ఆడించి మలక్‌పేట్ గంజ్‌లో విక్రయిస్తుంటాడు. దీంతో అతడికి సూర్యాపేటలోనే వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వనస్థలిపురం రైతుబజార్‌ను సోమవారం నుంచి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇక్కడి ఎస్‌కేడీనగర్, ఏ, బీ టైపు క్వార్టర్స్, ఫేజ్-1,హుడా సాయినగర్‌లోని కొన్ని వీధులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. దీంతో పాటు రైతుబజార్ పరిసర ప్రాంతాలు క్రాంతి హిల్స్, సుష్మాసాయినగర్, కమలానగర్, సచివాలయనగర్, సాహెబ్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని వీధులను కంటైన్మెంట్ జోన్లుగా సోమవారం ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.

Tags

Next Story