ఏపీకి తుఫాను హెచ్చరికలు..
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్ గా మారింది. ఇది మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి ఆంఫాన్ గా నామకరణం చేశారు. ఇది ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ దిశగా 1వెయ్యి 40 కి. మీ దూరంలోను, పశ్చిమ బెంగాల్ ల్లోని దిఘాకు నైరుతి దిశలో 1వెయ్యి 2వందల కి.మీ దూరంలో.. బంగ్లాదేశ్ లోని ఖేపుపురానికి దక్షిణ 13వందల కి. మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత వేగంగా బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారానికి ఇది విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏపిలోని తూర్పు తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. గంటకు 55నుంచి 65కి. మీ వేగంతో గాలులు వీస్తాయని, తుఫాన్ బలపడుతున్న సమయంలో 80 కి. మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఈనెల 20 తేదీ తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, యానాంలో గంటలకు 30నుంచి 40కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపిలోని పలు పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురువనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com