సీరియల్స్ షూటింగ్ షురూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
తమిళనాడు ప్రభుత్వం బుల్లి తెర షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలు, సీరియల్స్ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతుంటాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్డౌన్ విధించగా ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయాయి. మరి ఈ నెలాఖరుకి లాక్డౌన్ పూర్తవుతుంది. అప్పుడైనా షూటింగ్లకు అనుమతులు ఇవ్వాలంటూ దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం, దక్షిణ భారత బుల్లితెర నిర్మాతల సంఘం ముఖ్యమంత్రి ఎడప్పాడిని కలిసి విన్నవించుకున్నారు. దీంతో కొన్ని షరతులు, నిబంధనలతో టీవీ సీరియల్స్కి సంబంధించిన షూటింగ్లు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి మంజూరు చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. కొన్ని నిబంధనలు జారీ చేసింది. అవి..
నాలుగు గోడల మధ్య షూటింగ్ చేసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లలో అనుమతి లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఔట్డోర్ షూటింగ్ చేసుకోవచ్చు.
షూటింగ్ ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి లేదు
షూటింగ్ జరిగే ప్రదేశంలో ముందూ, తర్వాత శానిటైజర్తో క్లీన్ చేయాలి
షూటింగ్లో పాల్గొనే నటీనటులు తప్ప మిగిలిన వారంతా కచ్చితంగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. విరామ సమయంలో నటీనటులు కూడా మాస్కులు ధరించాలి.
యూనిట్ సభ్యులంతా తరచూ సబ్బుతో గానీ, శానిటైజర్తో గానీ చేతులు శుభ్రం చేసుకోవాలి.
అలాగే షూటింగ్ స్పాట్కి వచ్చే వాహనాలన్నీశానిటైజర్తో పిచికారీ చేయించాలి. కెమెరా, క్రేన్ తదితర పరికరాలను కూడా శానిటైజ్ చేయాలి.
నటీనటులకు కానీ, సాంకేతిక సిబ్బందికి కానీ జలుబు, దగ్గు ఉంటే స్పాట్లోకి ప్రవేశం లేదు. వారిని తక్షణమే వైద్యులకు చూపించాలి.
20 మందికి మించి షూటింగ్ స్పాట్లో ఉండకూడదు.
కార్పొరేషన్ కమిషనర్ వద్ద కానీ, జిల్లా కలెక్టర్ అనుమతితో కానీ షూటింగ్ మొదలు పెట్టాలి.
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు కట్టుబడే షూటింగ్లు జరుపుతామని నిర్మాతలు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com