తెలంగాణలో కొత్తగా 99 మందికి కరనా పాజిటివ్
![తెలంగాణలో కొత్తగా 99 మందికి కరనా పాజిటివ్ తెలంగాణలో కొత్తగా 99 మందికి కరనా పాజిటివ్](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/06/Screenshot_3-1.jpg)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 99కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 87మంది కాగా.. మరో 12మంది వలస కూలీలకు పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారినపడి నలుగురు మరణించగా.. మృతుల సంఖ్య 92కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ లో 3, నల్లగొండలో 2 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మహబూబ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్తగా నమోదైన 99 కరోనా పేషంట్లతో కలుపుకుని రాష్ట్రంలో ఓవరాల్గా కేసుల సంఖ్య 2వేల 891కి చేరింది. ఇందులో తెలంగాణకు చెందినవారు 2445 మంది కరోనా బారినపడగా...446 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఐతే తెలంగాణలో రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంత ఊరటనిస్తోంది. 24గంటల్లో 35మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1526కి చేరింది. ప్రస్తుతం 1273 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లోనే ఉంటున్నారు. ఉస్మానియా వైద్య కళాశాల హాస్టల్ లో 296 మంది విద్యార్థులు ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో, 12 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com