ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు వైఎస్ జగన్. పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ఆయన… సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుట తిరునామాలు పెట్టుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి వచ్చారు. టీటీడీ అర్చకులు, ఈవో సింఘాల్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించి, ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకున్నారు జగన్. ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు ఆయన వెంట ఉన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలను జగన్కు అందించారు అర్చకులు.
తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు దర్గా పీఠాధిపతి స్వాగతం పలికారు.
కడప నుంచి పులివెందుల వచ్చిన జగన్ అక్కడి సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి ఫాస్టర్లు జగన్ను ఆశ్వీరదించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పులివెందుల నుంచి ఇడుపులపాయ వెళ్లిన జగన్ తన తండ్రి, దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు . ఆయన వెంట పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.. ఫలితాలు వచ్చాక తొలిసారి ఇడుపులపాయ వచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇడుపులపాయ నుంచి విజయవాడ చేరుకున్న జగన్..బెడవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న..అనంతరం గేట్ వే హోటల్ లో బస చేసిన గవర్నర్ నరసింహన్ తో సమావేశం అయ్యారు జగన్. గురువారం జరిగే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.