హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో సాయంత్రం 5 గంటలకే చిమ్మచీకటి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, మణికొండ, బంజారాహిల్స్, షేక్పేట, అమీర్పేట, సనత్ నగర్, బేగంపేట, కోఠి, నాంపల్లి, కీసర, మేడ్చల్, తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సైనిక్పురిలో ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షాలు పడ్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. అటు రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన కురిసింది.
మరోవైపు హైదరాబాద్తో పాటు కరీంనగర్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో వర్షం పడింది. ఉత్తర కోస్తా నుంచి , దక్షిణ తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. మరో నాలుగైదు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.