నల్లగొండ లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలసి హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వనున్నారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
నియోజకవర్గవ్యాప్తంగా గట్టి కేడర్, అనుచరులున్న ఉత్తమ్ స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి అక్కడి నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు కూడా నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ బిజీగా ఉంటే నియోజకవర్గంలో ఆమె పర్యటించి ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తుంటారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని నేతలను ఆమె గుర్తుపట్టి పలకరించగలిగేంత సంబంధాలున్నాయి. అయితే, ఈ దఫా పోటీకి ఆమె ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తనకూ ఓ నియోజకవర్గం ఉన్నందున దాన్ని వదులుకుని భర్త ప్రాతినిధ్యం వహించిన స్థానానికి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనే ఆలోచనతో ఆమె పోటీకి నిరాకరిస్తున్నట్టు సమాచారం.
అయితే పద్మావతి ఉప ఎన్నిక బరిలో లేకపోతే ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ నేతలకే చాన్సిస్తారా… లేక జిల్లాకు చెందిన బిగ్షాట్స్ను ఎవరినైనా తీసుకువస్తారా.. అన్నది ఇప్పుడు హుజూర్నగర్లో హాట్టాపిక్ అయింది. ఉత్తమ్ కూడా దీనిపై సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కొత్తవారిని బరిలో దింపాల్సి వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఆయన అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తారని అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక ఉపఎన్నికలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను బరిలో దించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు… ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు మహాకూటమిగా బరిలోకి దిగి హుజూర్నగర్లో విజయం సాధించాయి… నల్గొండ ఎంపీగా ఉత్తమ్ ఎన్నికవడంతో ఉపఎన్నికల్లో కోదండరాంను పోటీ చేయించే యోచనలో స్థానిక టీజేఎస్ నేతలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సాధారణం కాదు. ఉత్తమ్ చేతిలో కేవలం మూడు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి… మరోసారి ఆయనకే అవకాశం ఇస్తారని కొందరు భావిస్తున్నారు. ఇంకోవైపు నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఓటమిపాలైన కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది… ఏది ఏమైనా ఉప ఎన్నికలో కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాతావరణం కనిపిస్తోంది.