విజయవాడలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యం కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కూతురు కనిపించకుండాపోవడంపై పటమట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్ధిని కోసం గాలిస్తున్నారు.
విజయవాడలో భారతీనగర్లో తల్లిదండ్రులతో కలిసి నాగసాయి దుర్గ నివాసముంటోంది. బెజవాడ మాచవరంలోని ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ రామలింగేశ్వర్నగర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కాలేజీ రీఓపెన్ కావడంతో గురువారం ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్కు కాలినడకన బయలు దేరింది. ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయింది.
భారతీనగర్లోని ఇంటికి చేరుకోవాలంటే కిలో మీటర్ వరకు నడిచి వచ్చి షేర్ ఆటోలో ఇంటికి బయలుదేరి రావాలి. ఐతే 9 గంటలు దాటినా సాయిదుర్గ ఇల్లు చేరలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లి తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసింది. కానీ ఫలితం లేకపోయింది. తన బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి అనుమానిస్తోంది. ఈ మేరకు పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కేసు మిస్టరీని చేధిస్తామంటున్నారు.