ట్రిపుల్ తలాక్ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేంద్రం చట్టం చేసిన తర్వాత కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్లో అదనపు కట్నం తేలేదని భార్యకు కదులుతున్న రైలులో భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తర్వాత ఆమెపై దాడి చేసి రైలు నుంచి దూకి పారిపోయాడు.
దీంతో బాధితురాలికి స్వల్ప గాయాలు కాగా GRP ప్రథమ చికిత్స చేసి, తిరిగి కాన్పూర్లోని దేహత్కు పంపించారు. జరిగిన అన్యాయం గురించి బాధితురాలు భోగానిపూర్ పోలీస్ స్టేషన్లో భర్తతోపాటు అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు.