తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగవంతం చేసింది బీజేపీ. ప్రధానంగా కాంగ్రెస్నే టార్గెట్ చేసింది కమలదళం. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో తీసుకునేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు చేసినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన విమర్శలే నిదర్శనమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సమర్ధవంతమైన రాష్ట్ర నాయకత్వం లేకపోవటంలో కాంగ్రెస్ పరిస్తితి దిగజారిపోతుందని విమర్శించారు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి. కేసీఆర్ తో ఫైట్ చేయాలంటే కేవలం డబ్బే కాదని.. బీజేపీ లాంటి పార్టీ కూడా అవసరమంటున్నారాయన. ఈ వ్యాఖ్యలే బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన ముందస్తు సంకేతాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు..
మరోైవైపు.... కేవలం కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ఒక్కడే బీజేపీలో చేరడం లేదనే ప్రచారమూ జరుగుతోంది. ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతల్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఫోన్ చేయడమే దీనికి నిదర్శనం. ఆదివారం సాయంత్రం.. జగ్గారెడ్డికి ఫోన్ చేసి తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అంతే కాదు... మరికొందరితోనూ ఆయన చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్ల్లో ఒకరిద్దరిని మినహాయించి... మిగిలి వారితో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి టచ్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది..
మరోవైపు... తెలంగాణ బీజేపీ నేతలు సైతం వలసలపై బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ నెలాఖరు నుండి పార్టీలో చేరికలు ఉండబోతున్నాయంటున్నారాయన. అయితే..రాజగోపాల్ రెడ్డి కాషాయ స్వరంపై అతని సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్లో ఉంటానంటున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజపోగాల్రెడ్డ... బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.