మ్యాజిక్ అంటేనే రకరకాల ట్రిక్కులు. ఇంద్రజాలంతో క్షణాల్లో అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక వేళ అవి ఫెయిలయితే ఫలితం ప్రాణాల మీదకే తెస్తుంది. తాజాగా ఇంలాంటి ఘటనే కోల్కతాలో చోటు చేసుకుంది. ట్రిక్కు పని చేయకపోవడంతో ఏకంగా మెజీషియన్ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
కోల్కతాలో మ్యాజిక్ వికటించింది. మ్యాజిక్ కాస్తా ట్రాజిక్ అయ్యింది. ఇంద్రజాలం చేస్తానంటూ హౌరా బ్రిడ్జి మీద నుంచి గంగానదిలోకి దిగిన మేజిషియన్ చంచల్ లాహిరి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం నుంచి గంగా నదిలో గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్... ఎట్టకేలకు మెజీషియన్ చంచల్ లాహిరి మృతదేహాన్ని బయటకు తీశారు.
జాదుగర్ మంద్రాకేగా ప్రసిద్ధి పొందిన 40 ఏళ్ల చంచల్ లాహిరి పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలోకి దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను ఓ బాక్స్లో బంధించుకుని గంగా నదిలోకి దిగి.. ఆతరువాత సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కానీ మ్యాజిక్ విఫలమైంది. జాదుగర్ మంద్రాకే నీటిలో గల్లంతయ్యాడు. ఎంతకీ బయటకు రాలేదు. దీంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు 24 గంటల తరువాత డెడ్ బాడీని బయటకు తీశారు.
21 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసాన్ని లాహిరి విజయవంగా పూర్తి చేశాడు. అప్పుడు కూడా బుల్లెట్ప్రూఫ్ గ్లాస్ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. 29సెకన్లలో బయటికి వచ్చి అద్భుతం చేశాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్ కాలేదు. అంతే కాదు ఈసారి తాను బయటకు రావడం కష్టమేనని... బయటకు రాగలిగితే మ్యాజిక్ అవుతుంది. లేదంటే ట్రాజిక్ అవుతుందని విన్యాసానికి ముందు లాహిరి అన్నాడు. కానీ ఆయన చెప్పిన రెండోదే నిజమైంది. ఆయన ఊహించినట్లే మ్యాజిక్ కాస్తా ట్రాజిక్ అవడం విచారకరం.