బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన హైదరాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత శంషాబాద్ సమీపంలో రంగానాయకుల తండాలోని గిరిజన మహిళ సోనినాయక్ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు.
సోని నాయక్ ఇంట్లో అల్పాహారం తీసుకున్న తరువాత.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్లోని కేఎల్సీసీ కన్వెన్షన్ హాల్కు చేరుకుంటారు. సభ్యత్వ నమోదు తరువాత.. రాత్రి 7 గంటలకు శంషాబాద్లోని నోవాటెల్కు చేరుకుని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 20 మంది ముఖ్యనేతలు ఈ సమావేవంలో పాల్గొంగారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇవాళ రాత్రి అమిత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. తరువాత నేతలతో కలిసి విందు భోజనం చేసి.. రాత్రి 8.40 గంటలకు హస్తినకు తిరుగు పయనం కానున్నారు.