టీమిండియా మాజీ కెప్టెన్.. మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ ఊహాగానాలపై స్పందించాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకుంటానో తనకే తెలియదన్నాడు. తను శ్రీలంకతో మ్యాచ్కు ముందే రిటైర్ కావాలని చాలా మంది కోరుకున్నారని.. అయితే ఈ విషయంలో తాను టీమిండియా క్రికెటర్లను గానీ.. జట్టు యాజమాన్యాన్ని గానీ తప్పుబట్టాలని అనుకోవట్లేదని ధోనీ చెప్పాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరున్న ధోనీ.. ఇటీవలి కాలంలో స్థాయికి తగిన ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో జిడ్డుగా ఆడుతూ విమర్శలు మూటగట్టుకున్నాడు. మరోవైపు జులై 14 న జరిగే ఫైనల్లో టీమిండియా గెలిస్తే... ధోనీకి అదే సరైన ముగింపు అంటూ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంటే ధోనీ రిటైర్ కావాలని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే ధోనీ తాజా వ్యాఖ్యలు చేశారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.