పోలవరం ప్రాజెక్టు పునరావాస కార్యకలాపాల్లో అవకతవకలు జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్... రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయ పునరావాస కార్యకలాపాలు జరుగుతాయన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నిత్యం పర్యవేక్షిస్తూ...
ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వాలకు చేరవేస్తుందని తెలిపారు. పోలవరం నిర్వాసితుల విషయంలో ఇప్పటికే గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో..ఒక కమిటీ నియమించారని.. ఆ కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తోందని షెకావత్ చెప్పారు. అన్ని రకాల అనుమతులు వచ్చినందున... సవరించిన అంచనాల ఆమోదానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కావాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించినట్లు సభలో షెకావత్ తెలిపారు.