పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులు కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాము లను వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియా ముందుకు తీసుకొచ్చారు. రాంప్రసాద్ హత్యలో 11 మందికి ప్రమేయం ఉందని చెప్పారాయన. సుమారు 23 కోట్ల భూ వివాదమే హత్యకు కారణమని తెలిపారు. కోగంటి సత్యంపై 21 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పక్కా పథకం ప్రకారం రాంప్రసాద్ను నిందితులు హతమార్చినట్లు చెప్పారు డీసీపీ శ్రీనివాస్.
భూవివాదంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రాంప్రసాద్ పై కక్ష పెంచుకున్నాడు కోగంటి సత్యం. రాంప్రసాద్ను హత్య చేస్తే.. ఆ భయంతో అతని బావ శ్రీనివాస్ మిగతా డబ్బులు చెల్లిస్తాడని పథకం వేశాడు. ఈ క్రమంలోనే రాంప్రసాద్ హత్యకు శ్యామ్ను పురమాయించాడు. ఇందుకోసం అతనికి 3 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. రాంప్రసాద్ను హతమార్చేందుకు నెల రోజులు రెక్కీ నిర్వహించారు. 6 మారణాయుధాలు ఉపయోగించి చంపేశారు.
రాంప్రసాద్ హత్య కేసులో చాలా ట్విస్ట్లున్నాయి. తానే చంపానని శ్యామ్ అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. అయితే పోలీసులు దీన్ని నమ్మలేదు. శ్యామ్ వెనుక కోగంటి సత్యం ఉన్నాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఆ కోణంలోనే విచారణ జరిపారు. దీంతో హత్య కేసు మిస్టరీ వీడింది. రాంప్రసాద్ను చంపేందుకు సత్యం ఏకంగా ఏడు టీమ్లు ఏర్పాటు చేశాడని తేలింది. అయితే శ్యామ్ టీం పక్కాగా రెక్కీ నిర్వహించి రాంప్రసాద్ ను హత్య చేసింది.