ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో.. ఆ ముగ్గురు..

Update: 2019-07-19 08:50 GMT

అందరికీ ఉద్యోగం.. ఆచరణలో కష్టమేమో.. మీ వంతుగా మీరూ ప్రయత్నించండి.. చేయాలనుకుంటే చాలా పనులుంటాయి. పకోడీల వ్యాపారం ఎందుకు చేయకూడదు.. ఓ సారి ఆలోచించండి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టాన్ని తీసుకురాదు. రుచిగా సుచిగా వండి పెట్టారనుకోండి.. మీ బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా మారుతుంది. కాలం వృథా చేయకుండా పకోడి బండ్లు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలి.. అని కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ అన్నమాటలు యువత మెదళ్లను చేరాయో లేదో కానీ ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం అక్షరాలా పాటించారు. మోదీ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఈముగ్గురూ మాత్రం ఖాళీగా ఉండి కాలక్షేపం చేసే బదులు మనం కూడా పకోడీల వ్యాపారం ఎందుకు చేయకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశారు. అయిదువేల రూపాయల పెట్టుబడితో ఆగ్రాకు చెందిన ముగ్గురు.. శ్రీ గోపాల్ అగర్వాల్, రాజ్ కుమార్ గార్గ్, అశోక్ కుమార్‌లు కలిసి మోదీ పకోడా భండార్ పేరిట పకోడీల దుకాణం ప్రారంభించారు. వీరి దుకాణంలో మిర్చి పకోడాతో పాటు పాలక్, ఆలూ, పెసర, కోప్తా పకోడాలు చేస్తూ రోజుకు ఆరువందలు సంపాదిస్తున్నారు. మోదీ ఇచ్చిన ఐడియా సూపర్‌గా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News