ఏపీలో సీఎం జగన్కు వ్యతిరేకంగా నిరసన సెగలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మొన్నటి వరకు ప్రధాన విపక్షం మాత్రమే వైసీపీ తీరుపై మండిపడుతూ వస్తోంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ సైతం జగన్ తీరుపై యుద్ధం మొదలు పెట్టారు..
ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఇటీవల జగన్ వ్యాఖ్యలు చేశారు. మాల మాదిగల మధ్య చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు నుంచి ఏపీ అసెంబ్లీకి పాదయాత్రకు పిలుపు ఇచ్చారు. ఆ పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ పాలనపై మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు..
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. రెండు పాలనలోనే జగన్ ఎంత నియంతగా ఉంటున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదహరణ అన్నారు. సీఎం జగన్ గతనంలో ఇచ్చిన వాగ్దాలను అమలు చేయడం మానేసి.. ఇలా ఉద్యమాలని అణిచివేయాలని చూస్తున్నారంటూ మందకృష్ణ నిప్పులు చెరిగారు..
గతంలో ఉద్యామాలను అణిచివేయాలనుకున్న చంద్రబాబుకు ఈ ఎన్నికలో ఎలాంటి గతి పట్టిందో జగన్ గుర్తుంచుకోవాలన్నారు. గుంటూరులో తన పాదయాత్రను తాత్కాలికంగా అడ్డుకుని విజయం సాధించానని జగన్ అనుకుంటే పొరాపాటే అన్నారు.
వెంటనే జగన్ స్పందించి.. అసెంబ్లీ వేదికగా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేది లేదని.. భవిష్యత్తులో పోరాటాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ తీరును వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. మొన్నటి వరకు జగన్ పాలనను పొగిడిన ఆయన.. ఇలా మాట్లాడడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణ వెనుక ఎవరో ఉండి డ్రామాలు ఆడిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.