ఉత్తరప్రదేశ్లో కాల్పుల మోత మోగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 ఎన్కౌంటర్లు... అది కూడా 24 గంటల వ్యవధిలో. ఒకే ఒక్క రోజులో యూపీ లో 7 ఎన్కౌంటర్లు జరిగాయి. ఏడుగురు క్రిమినల్స్ను అదుపులోకి తీసుకు న్నారు. మరో ఇద్దరు పారిపోయారు. దుండగుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
రాయ్బరేలీ, ఘజియాబాద్, మొరాదాబాద్లలో ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 3 ఎన్కౌంటర్లు ఒక్క ఘజియాబాద్లో జరిగాయి. కవినగర్, మోదీ నగర్, విజయ్ నగర్లలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనల్లో ముగ్గురు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. హాపూర్లో బైక్పై వెళ్తున్న ఇద్దరు నేరస్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. నేరస్థులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొరాదాబాద్లో ఓ నేరస్తుడు పోలీసులకు పట్టుబడగా మరో నిందితుడు పరారయ్యాడు. రాయ్బరేలిలో ఓ రౌడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ఓ పోలీస్కు గాయాలయ్యాయి.
రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వం పూర్తి స్వేచ్చనివ్వడంతో పోలీసులు.. నేరస్థులు, సంఘవిద్రోహ శక్తుల తోలు తీస్తున్నారు. ఐతే లొంగిపో-లేకపోతే చచ్చిపో అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందల ఎన్కౌంటర్లు జరిగాయి. డజన్ల మంది పేరు మోసిన రౌడీలు హతమయ్యారు. వందలాదిమంది లొంగిపోయారు.