హయత్నగర్లో కిడ్నాపైన విద్యార్ధిని సోనీ ఆచూకి లభ్యమైంది. కిడ్నాపర్ రవిశేఖర్.. సోనీని ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్లో వదిలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఓ యువతి ఫోన్ తీసుకున్న సోనీ మామయ్యకు విషయం తెలిపింది. ఆ సమాచారం ఆధారంగా తెలంగాణ పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లారు.. సోనీని హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం హయత్నగర్ పీఎస్లో సోనీ ఉన్నట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ చిరువ్యాపారిని నమ్మించి.. అతడి కుమార్తె సోనీని వారం క్రితం రవిశేఖర్ కిడ్నాప్ చేశాడు.. హయత్నగర్లో సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్.. అక్కడ్నుంచి కడప జిల్లా ఒంటిమిట్ట తీసుకెళ్లాడు.. అక్కడ్నుంచి తిరుపతి వెళ్లాడు.. ఆ తర్వాత అద్దంకిలో యువతిని వదలి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఏడు రోజులుగా పోలీసులు ఏపీ, తెలంగాణలో గాలింపు చేపట్టినా ఆచూకి లభించలేదు. సోని క్షేమంగా ఉందన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. కిడ్నాపర్ రవిశేఖర్ జాడ మాత్రం ఇంకా తెలియలేదు. కారులో దర్జాగా తిరుగుతున్నా పోలీసులకు చిక్కడం లేదు. ఇతడిపై ఇప్పటికే 25 పాత కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఎక్కడున్నాడు..? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు..? రవిశేఖర్ నల్గొండ జిల్లాలో ఉన్నాడా..? పోలీసులు ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. దామరచర్ల మండలం కొండ్రపోల్లో విజిలెన్స్ అధికారి పేరుతో ఓ ఎరువుల దుకాణంలో దోపిడీ చేసింది రవిశేఖర్గా పోలీసులు అనుమానిస్తున్నారు.. సీసీ కెమెరాలో ఫేక్ ఆఫీసర్ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.. ముఖ కవళికలు రవిశేఖర్లాగే ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.. గుంటూరు వెళ్లినట్లుగా తేలడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.