కూతురిని చంపి.. ఉరి వేసుకున్న నటి

Update: 2019-08-10 11:07 GMT

మానసిక సమస్యలు.. మారని ఆర్థిక పరిస్థితులు. మరణమే శరణ్యమనుకుంది బుల్లి తెర నటి. కూతురిని కడతేర్చి తానూ తనువు చాలించింది ముంబై థానేకు చెందిన ఓ టీవీ ఆర్టిస్టు. ప్రాద్య్నా పర్కార్ అనే మహిళ మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. భర్త చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి పన్నెండో తరగతి చదివే కుమార్తె శ్రుతి ఉంది. కాగా, ప్రాద్యాకు ఈ మద్య సీరియల్స్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. భర్తకి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఆదాయం పెరిగే మార్గం కనిపించడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భర్త బయటకు వెళ్లడంతో ప్రాద్య్నా కూతురిని గొంతు నులిమి చంపేసింది. అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతకీ తీయక పోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టాడు. తల్లీకూతుళ్లిద్దరూ విగత జీవులుగా పడి ఉండడాన్ని గమనించాడు. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న అతడు.. కాసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. వారి మరణానికి ఆర్థికపరిస్థితులేనా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Similar News