దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతుంటే.. కొన్ని చోట్ల జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. సిద్ధిపేట జిల్లా.. చేర్యాల మండలం తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని నిర్వహాకులు అవమానించారు. జెండాను తలకిందులుగా ఎగురవేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ దివ్య ధర్షన్ జెండాను ఎగురవేస్తున్న సమయంలో.. పైకి వెళ్తున్న జెండా ఒక్కసారిగా కిందకు జారింది. వెంటనే తేరుకుని మళ్లీ సరిచేసి జెండాను ఎగురవేశారు..
నిర్మల్ జిల్లా జెండా పండుగలోనూ అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి జెండా ఎగురవేస్తున్న సమయంలో.. పతాకం బిగుసుకుపోయింది. దీంతో హడావుడిగా జెండా వందనం చేసి.. అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోయారు.
కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. తెల్లవారే జెండా వందనానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినా.. మున్సిపల్ అధికారులు, నేతల మధ్య సమన్వయ లోపంతో 10 గంటల వరకు ఎవరూ జెండా ఎగురవేసేందుకు రాలేదు. అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎవరూ రాకపోవడంతో జెండా ఎగురవేయకుండానే ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.
దేశపౌరులు జాతీయ జెండాను అత్యున్నతస్థానమిచ్చి గౌరవిస్తారు. అలాంటిది దేశస్వాతంత్ర్యం రోజున జాతీయ జెండాను అవమానించింది మెదక్ జిల్లాలోని మేరీ మాత స్కూల్ యాజమాన్యం. చిన్నశంకర్పేట్ మండల కేంద్రంలోని మేరీ మాత స్కూల్లో జాతీయ జెండా కర్ర పైన క్రీస్తు శిలువ కట్టారు. జాతీయ జెండాపై జీసెస్ క్రాస్ను పెట్టడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ జెండాను అవమానించారని BJP,VHP, భజరంగ్దళ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. రోడ్డుపై ధర్నాచేసి స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.