సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకున్న జనసేన... విజయం వైపు అది తమ తొలి అడుగు అని చెబుతోంది. సీట్లు రాకున్నా..ఓట్లు మాత్రం ఆశజనకంగా ఉన్నాయని ఇది తమ నైతిక విజయం అని ప్రకటించుకుంది. జనసేన బలోపేతంపై దృష్టి సారిస్తూనే విలువల రాజకీయం చేస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్.
ఎన్నికల తర్వాత జనసేనను తమలో కలిపేయాలని ఓ జాతీయ పార్టీ ఒత్తిడి తెస్తోందని అన్నారు పవన్. అయితే..తాను అలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీని విలీనం చేయబోనని తేల్చి చెప్పేశారు. జాతీ సమగ్రత, విలువలు, ప్రజల కోసమే జనసేన ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్..పార్టీ కోసం అభిప్రయాలను నేరుగా చెప్పాలని..సోషల్ మీడియాలో హడావుడి చేయొద్దని సూచించారు.
కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. జనసైనికులు అంతా వరదబాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం పనితీరుపైనా ఫోకస్ చేయబోతున్నట్లు ప్రకటించారు వపన్ కళ్యాణ్.
సెప్టెంబర్ 7వ తేదీ నాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి కానుంది. ఈ వంద రోజుల ప్రభుత్వ పని తీరు, రాష్ట్రాభివృద్ధి లాంటి విషయాలపై అధ్యయనానికి 10 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.