కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భగవత్ ఎయిమ్స్కు వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న జైట్లీని పరామర్శించారు.
కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా జైట్లీని పరామర్శించి వెళ్లారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న జైట్లీ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా జైట్లీని పరామర్శించారు.
మోదీ-1 హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్కు వచ్చి అదే చికిత్సను కొనసాగించిన జైట్లీ.. ఆరోగ్య సమస్యలతో కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.