అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి.. పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఢిల్లీలోని కైలాశ్ కాలనీలోని జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పుష్ప గుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు..
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం సహచరుడికి నివాళులు అర్పించారు. జైట్లీ లాంటి మేధావిని కోల్పోవడం దేశానికి పెద్ద లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు..
అంతకుముందు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం జైట్లీ నివాసానికి వెళ్లి... ఆయన భౌతిక కాయం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. జైట్లీ మరణంతో కుటుంబ సభ్యుణ్ని కోల్పోయానని... రాజకీయాల్లో జైట్లీయే తనకు మార్గ దర్శకుడని అమిత్ షా సంతాపం తెలిపారు.