ఫేస్ బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫేస్ బుక్ ద్వారా ప్రేమలోపడి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో జరిగింది.
హౌజింగ్ బోర్డ్ కాలనీకి చెందిన 15 ఏళ్ల సిరివర్షిణి మహబూబ్నగర్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఇటీవలె హయత్నగర్ మండలం కోహెడ ప్రాంతానికి చెందిన నవీన్ రెడ్డితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నెల 27న సిరివర్షిణి అదృశ్యమవడంతో తండ్రి రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఫేస్ బుక్ ఐడీ ద్వారా నవీన్ రెడ్డి వివరాలు సేకరించారు. నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
జడ్చర్ల పట్టణం శంకరాయపల్లి సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలో సిరి వర్షిణిని హతమార్చినట్టు నవీన్ అంగీకరించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలసుకున్నారు. సోషల్ మీడియా పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిరి వర్షిణి హత్యకు కారణమైన నవీన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.