విశాఖలో భార్గవిపై దాడిచేసిన కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. భార్గవితోపాటు ఆమె స్నేహితుణ్ని కూడా చంపేందుకు ఉన్మాది సాయి స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్గవిని, ఆమె స్నేహితుడు మన్సూర్ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అయితే, మన్సూర్ మిస్ కావడంతోనే భార్గవిపై దాడి చేసినట్లుగా నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్ దగ్గర భార్గవి గొంతు కోశాడు సాయి. అందరూ చూస్తుండగానే స్క్రూడ్రైవర్తో గొంతు కోశాడు ప్రేమోన్మాది సాయి. ఈ దాడితో భార్గవి రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. యశోద భార్గవి అనే యువతి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. సాయి అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమె వెంట పడుతున్నాడు. కానీ భార్గవి అందుకు అంగీకరించలేదు. ప్రేమను నిరాకరించడంతో ఆమె మీద పగ పెంచుకున్నాడు. తనకు దక్కని యువతి మరెవరికి దక్కకూడదని భావించాడు.