తెలంగాణలో కొద్ది రోజులుగా ప్రతిపక్షంలో కంటే అధికార పార్టీలోనే రాజకీయం రంజుగా మారింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ... వరుస చేరికలతో తిరుగులేని శక్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్లో అంతు చిక్కని రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు జరిగిన వెంటనే కేటీఆర్కు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ వర్కింగ్ ప్రెసిండెట్గా నియమించారు. కేబినెట్ విస్తరణ కూడా ట్విస్టులతో నడిచింది. సీనియర్లు, మాజీ మంత్రులకు అతి కొద్దిమందికే అవకాశాలు దక్కాయి. రాను రాను సీనియర్లకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. గత ఎన్నికల్లో నలుగురు మంత్రులు ఓడిపోగా.. నాయిని, కడియం లాంటి వారిని పక్కకు పెట్టారు. లక్ష్మారెడ్డికీ అవకాశం దక్కలేదు. సీనియర్ లీడర్ హరీష్ రావును పక్కన పెట్టడంపై పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ. పోచారంని స్పీకర్గా, పద్మారావును డిప్యూటీ స్పీకర్గా చేసి సైలెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరుగా సీనియర్లు, మాజీ మంత్రులు పార్టీలో ఉంటూనే అప్రాధాన్యంగా మారిపోయారు.
ప్రస్తుత కేబినెట్లో ఐదుగురు కొత్త వారికి మంత్రి పదవులు దక్కాయి. త్వరలో జరగబోయే విస్తరణలో కూడా ఇదే తీరు ఉంటుందని టాక్. కేబినెట్లో సీనియర్లకు చెక్ పెట్టే పరిస్థితులు ఉంటాయని తాజా పరిణామాలు చెప్తున్నాయి. కొన్ని రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారంపై ఈటెల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఎవరూ పెట్టిన భిక్ష కాదని.. మేము గులాబీ ఓనర్లమని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాకుండా మరో సీనియర్ మంత్రి జగదీశ్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డికి ఉద్వాసన తప్పదనే చర్చ సాగుతోంది. ఈ దఫా సీఎంగా కేసీఆరే కొనసాగుతారని.. వచ్చేసారికి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. అందుకోసం ఇప్పట్నించే పార్టీలో, ప్రభుత్వంలో సమూల మార్పులు జరగబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.