కడప జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ప్రొద్దుటూరులో కుంభవృష్టి కురవడంతో... కామనూరు - రాధానగర్ మధ్య కుందూనదిలో ఆటో కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. జమ్మలమడుగు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా, కుందూనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దముడియం గరిశలూరు, నెమళ్ల దిన్నె గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. పెద్ద ముడియం పోలీస్ స్టేషన్లోకి నీరు చేరింది. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై నాలుగు అడుగుల మేర కుందూనది ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు గండికోట, మైలవరం జలాశయాల మీదుగా వరదనీరు పెన్నా నదిలోకి చేరుతుండడంతో.. నది పరవళ్లు తొక్కుతోంది. ఇక అటు పలు గ్రామాల్లో వరదలకు పంట నీట మునగడంతో.. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.