హుజూర్నగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 19తో ప్రచార పర్వానికి తెరపడనుంది. 21న ఉప ఎన్నిక జరుగనుంది. పోలింగ్కు టైమ్ దగ్గర పడడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో మూడ్రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో నేతలంతా అక్కడే మకాం వేశారు...
హుజూర్నగర్లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి...నిజయోకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గురువారం జరిగే భారీ బహిరంగ సభకు...సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్రెడ్డి పర్యవేక్షించారు.
మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పట్టుబట్టి మరీ తన భార్యకు టికెట్ సాధించుకున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఎలాగైనా గెలిచితీరాలని వ్యూహాలు రచిస్తున్నారు. అటు పద్మావతి రెడ్డి సైతం స్థానిక నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ చేసిన అభివృద్ధే తనను గెలిపించి తీరుతుందని పద్మావతి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సైతం... హుజూర్నగర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ ఉపపోరులో.. కాంగ్రెస్ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అటు.. బీజేపీ, టీడీపీ సైతం.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. హుజూర్నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచినా ప్రజలకు ఒరిగేమీ లేదన్నారు బీజేపి నేతలు. అటు... అభ్యర్ధుల ప్రచారం ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘాపెడుతోంది ఎన్నికల సంఘం. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం TRS అత్యధికంగా 10 లక్షల 31 వేలు, కాంగ్రెస్ 6 లక్షల 5 వేల ఖర్చుతో రెండోస్థానంలో ఉన్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం.