జయలలిత మృతిపై స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-17 01:49 GMT

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెంది మూడేళ్లు దాటినా డెత్‌ మిస్టరీ వీడలేదు. రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణ రహస్యాలు వెల్లడిస్తామంటూ ప్రకటించారు. దీంతో కచ్చితంగా జయ మృతి వెనుక ఏదో మిస్టరీ దాగుందనే అనుమానాలు పెరుగుతున్నాయి.

తమిళనాడులో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిని మరోసారి చర్చకు తీసుకువచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. 2016లో 75 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆమె మరణించారు. అయితే ఆమె మరణంపై చాలా అనుమానాలు లేవనెత్తాయి. స్పష్టమైన సమాధానం దొరకనప్పటికీ రోజులు గుడస్తున్నా కొద్ది జయలలిత మరణంపై చర్చ ఇటీవల సద్దుమణిగింది. ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తారు స్టాలిన్.

జయలలిత మరణ రహస్యాన్ని తమ పార్టీయైన డీఎంకే బయటపెడుతుందని స్టాలిన్ అన్నారు. పళనిస్వామి ప్రభుత్వం పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిందని, జయలలిత మరణ రహస్యాన్ని వెల్లడించడంతో చట్టబద్ధతపై విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. దక్షిణ తిరునెల్వేలి జిల్లాలోని విక్రవాండి విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏఐడీఎంకె ప్రభుత్వం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్సను రహస్యంగా ఉంచినట్లు స్టాలిన్ ఆరోపించారు. కరుణానిధి చికిత్సలో ఉన్నప్పుడు, ఆసుపత్రి రెగ్యులర్ బులెటిన్ జారీ చేసిందని గుర్తు చేశారు. జయలలిత మరణంపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని స్టాలిన్ ప్రకటించారు.

Similar News