జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు

Update: 2019-10-25 16:06 GMT

జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లకు కేంద్రం కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను బదిలీ చేసింది. ఆయన్ను గోవా గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి గిరిష్ చంద్ర ముర్ము, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ను నియమించింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఈ నెల 31 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మిజోరాం గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లైని నియమించింది కేంద్రం.

జమ్మూ కశ్మీర్‌కు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన గిరిశ్ చంద్ర ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో పనిచేస్తున్నారు. ఆయన 1985 బ్యాచ్ చెందిన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇక రాధాకృష్ణ మాథుర్ 1977 బ్యాచ్ కు చెందిన త్రిపుర క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి. ముఖ్య సమాచార కమిషనర్‌గా పనిచేసిన మాథుర్ గతేడాది నవంబర్ లో పదవీ విరమణ పొందారు.

Similar News