హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. 40 సీట్లతో హర్యానాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వంసిద్ధం చేసుకుటోంది. బీజేపీ-జేజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పరిశీలకులుగా హాజరవుతారు. ఈ సమావేశం తర్వాత... ఖట్టర్ గవర్నర్తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అడగనున్నారు.
ఫలితాలు వచ్చినప్పటి నుంచీ జేజేపీ అధినేత దుష్యంత్తో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతునే ఉంది. అటు కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా సీఎం పదవి ఇవ్వచూపినా దుష్యంత్ మొగ్గుచూపలేదు. కమలనాథులతో కలిసి వెళ్లేందుకే సిద్ధమయ్యారు. నిన్న కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసంలో చర్చలు జరిపి అమిత్ షా వద్దకు వెళ్లారు. పొత్తులో భాగంగా జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, దుష్యంత్, అనురాగ్ ఠాకూర్లతో కలిసి అమిత్ షా నివాసానికి వచ్చి మీడియా ముందు పొత్తుపై ప్రకటన చేశారు. హర్యానా ప్రజలకు ఐదేళ్లపాటు సుస్థిరమైన పాలన అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల నేతలు తెలిపారు.