హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. హర్యానాలో 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. దీంతో ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.
రెండు పార్టీల పొత్తులో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఖట్టర్, దుశ్యంత్ ఇద్దరు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లి.. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుశ్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో.. ఆయన తండ్రి అజయ్ చౌతాలా పెరోల్ పై బయటికి వచ్చారు.