UPDATE : ఈ కింది వార్తకు సంబంధించి ఇచ్చిన సమాచారంలో కొన్ని తప్పులు దొర్లాయి.. ఉత్తరప్రదేశ్లో దీపావళి వేడుకల సందర్బంగా అయోధ్యలో 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించారని.. ఈ వేడుకలకు యోగి ఆదిత్యనాధ్ సర్కార్ రూ. 133 కోట్లు ఖర్చు చేసినట్టు వార్త రాశాము.. ఇది తప్పు వార్త అని తేలింది. ఈ వార్త రాసినందుకు చింతిస్తున్నాము.. దయచేసి గమనించగలరు.
ఉత్తరప్రదేశ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. అయోధ్యలోని సరయు నది ఒడ్డున యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనగా ఈ దీపోత్సవం ప్రపంచ రికార్డును సృష్టించింది. గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కింది.
ఈ దీపోత్సవం కార్యక్రమంలో సుమారు 2500 మంది కళాకారులు పాల్గొన్నారు. రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి యూపీ గవర్నర్ ఆనందీ బెన్, సీఎం యోగి ఆదిత్యానాథ్, మంత్రులు హాజరయ్యారు. నయా ఘట్ వద్ద సరయు నదికి హరతి ఇచ్చారు. దీపోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ వేడుకలకు రూ. 133 కోట్లు యోగి సర్కార్ ఖర్చుపెట్టింది. ఈ దీపావళిని పురస్కరించుకుని రామకథ పార్క్లో రాముడికి రాజ తిలకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు అయోధ్యలో రూ. 226 కోట్ల అభివృద్ధి పనులకు యోగి శంకుస్థాపన చేశారు. అయోధ్య గురించి మాట్లాడినప్పుడల్లా తన మదిలో రామరాజ్యం మెదులుతుందని అన్నారు. దేశంలో ఆధునిక రామరాజ్యం నడుస్తోందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నామని ఆదిత్య నాథ్ పేర్కొన్నారు .