హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని అధికారుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. కొందరు అధికారులు ఉలిక్కిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ తహసీల్దారు తన కార్యాలయంలో తాడు కట్టించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారుగా ఉమా మహేశ్వరి పనిచేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ హత్య నేపథ్యంలో తన కార్యాలయంలో తాడు కట్టించారామె. ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే తాడు అవతలి నుంచే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయ సిబ్బందిని సైతం ఉమా మహేశ్వరి అలర్ట్ చేశారు. ఏ ఒక్కరూ.. తాడు దాటి తనవైపు రాకుండా చూడాలని హుకుం జారీ చేశారు. తహసీల్దారు వైఖరి చూసి ఆఫీసు సిబ్బంది, కార్యాలయానికి వస్తున్న ప్రజలు విస్తుపోతున్నారు.
తహసీల్దార్ తన కార్యాలయంలో తాడు కట్టించడం కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే.. అర్జీలు ఇచ్చేందుకు వస్తున్న వారిలో కొందరు మద్యం తాగి వస్తుంటారని.. దురుసుగా ప్రవర్తిస్తుంటారని.. అందుకే తమ జాగ్రత్తలో తాము ఉంటామని చెప్పారామె.