జమ్మూకశ్మీర్లో SMS సర్వీసులను పున:ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో SMS సేవలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు హోటళ్లలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లను పునరుద్ధరించనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, విద్యార్థులు, పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆద్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితిపై సమాలోచనలు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కశ్మీర్ లోయలో SMS సర్వీసులను పున:ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఆర్టికల్-370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఆంక్షలు విధించారు. మొదట్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. కర్ఫ్యూ విధించి నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడడంతో నిషేధాజ్ఞలు సడలించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను పున:ప్రారంభించారు. అనంతరం కర్ఫ్యూ తొలగించి ల్యాండ్ ఫోన్లకు అనుమతి ఇచ్చారు. ఇక, అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్, లడ్ధాక్లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడడంతో మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం అనుకుంటోంది.