హైదరాబాద్లోని కాచిగూడ రైలు ప్రమాదంలో ఇంజన్లో ఇరుక్కున్న లోకో పైలెట్ ఇంకా బయట పడలేదు. ఆరుగంటలుగా అతడ్ని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగేనే ఉందని.. ఆక్సిజన్ మాత్రం అందిస్తున్నామని.. వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి కారణాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పని చేయలేదా..? లోకో పైలెట్ల మధ్య సమన్వయ లోపమే కారణమా..? అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇంజన్లో ఇరుక్కు పోయిన లోకో పైలెట్ బయకు వచ్చాకే పూర్తి స్థాయి వివరాలు తెలుస్తాయి అంటున్నారు అధికారులు.
రైలు ప్రమాదానికి కారణం ఏదైనా.. 25 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మూడు బోగీలు పక్కకు ఒరిగాయి. పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గానే పనిచేస్తోందని అధికారులు చెబుతున్నా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం రాంగ్ సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. లింగపల్లి నుంచి ఫలకనూమా వెళ్తున్న mmts.. మరో ఫ్లాట్ఫాంపై ఉన్న హంద్రీ ఎక్స్ప్రెస్కు ఒకేసారి సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగింది అంటున్నారు. రెండు ఇంజన్లూ బలంగా ఢీకొనడంతోనే ఈ దారణం జరిగింది అంటున్నారు.
మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు తలసాని.