ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం అటెండర్ చంద్రయ్య పరిస్థితి ధీనంగా మారింది. అతడి పరిస్థితిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వైద్యం నిలిచిపోయింది. ఆస్పత్రి బిల్లు కట్టడం లేదనే కారణంతో చంద్రయ్యను ఆస్పత్రి నుంచి చికిత్స మధ్యలోనే బయటకు తరిమేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవదహనమవుతుంటే కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఆఫీస్ అటెండర్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చంద్రయ్య.. సంతోష్ నగర్ అపోలో drdo ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు అతడి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
ప్రమాదం జరిగినప్పుడు అందరూ వచ్చి అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చారని.. ఇప్పుడు ఎవరూ అతడి పరిస్థితిని పట్టించుకోవడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అపోలో హాస్పిటల్కు వెళ్లి.. బిల్లులు కట్టడం లేదని స్పష్టం చేశారని, అక్కడి నుంచి అతడ్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలి అంటూ వేధించారని బంధువులు ఆరోపించారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో.. చంద్రయ్యను హాస్పిటల్ నుంచి అక్కడి సిబ్బంది తరమేశారు. దీంతో అతడి బంధువులు ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. అధికారులు, ఆసుపత్రి వారి వేధింపులకు నిరసనగా.. బుధవారం ఉదయం అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బంధువులు ఆందోళనకు దిగారు.