ఏపీలో ఇసుక దుమారం రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. నవంబర్ 14న చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు సిద్ధమవగా.. అదే రోజు నుంచి వారం పాటు ఇసుక వారోత్సవాలు నిర్ణయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. అటు వామపక్షాలు, భవన నిర్మాణ కార్మికుల ఆందోళనలు పలు చోట్లు ఉద్రిక్తంగా మారాయి.
నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలో ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఎవరైనా అక్రమ రవాణా చేసినా.. ఎక్కువ ధరకు అమ్మినా జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. గతంలో ఇసుక డిమాండ్ సరాసరి 80వేల టన్నులు ఉండేదని.. వరదలు, రీచ్లు మునిగిపోయిన కారణంగా ఈ డిమాండ్ను చేరుకోలేకపోయామన్నారు. అయితే గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్నారు జగన్. రీచ్ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి పెరిగాయన్నారు.
ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న విజయవాడ ధర్నాచౌక్ వేదికగా 12 గంటలపాటు దీక్షకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇసుక సమస్యపై రౌండ్ రేబుల్ సమావేశం నిర్వహించిన టీడీపీ.. ఇతర రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములను చేస్తోంది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ధర్నాచౌక్ ప్రాంతాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ప్రత్యేక సాంగ్ను రిలీజ్ చేశారు.
బెజవాడలో వామపక్షాలు చేపట్టిన "ఇసుక మార్చ్" ఉద్రిక్తంగా మారింది. పోలీసులు- నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని నదిలోకి వెళ్లిన నేతలు.. స్థానికులకు ఇసుకను పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి కన్నబాబు ఇంటిని ముట్టడించారు. పోలీసులు ఆందోళన కారుల్ని అరెస్టు చేశారు.