పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను లండన్కు తరలించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో బ్రిటన్కు తీసుకెళ్లారు. షరీఫ్ వెంట షాబాజ్ షరీఫ్, అతని వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్లు వెళ్లారు. నవాజ్ షరీఫ్ను గత వారమే చికిత్స కోసం లండన్కు తరలించాల్సి ఉండగా అతని పేరును ఎగ్జిట్ కంట్రోల్ లిస్టు నుంచి తొలగించకపోవడంతో జాప్యం జరిగింది. తాజాగా అన్ని అనుమతులు రావడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్ ఉన్న ఎయిర్ అంబులెన్స్లో డాక్టర్ల బృందం పర్యవేక్షణలో లండన్కు తరలించారు. అక్కడ ఛార్లెస్ టౌన్ క్లినిక్లో నవాజ్ షరీఫ్కు చికిత్స అందించనున్నారు.
అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఆయన్ను కోట్ లఖ్పత్ జైలుకు తరలించారు. అక్కడ జైలు శిక్ష అనుభవిస్తండగా అనారోగ్యానికి గురయ్యారు. హఠాత్తుగా ప్లేట్ లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోయింది. దాంతో వైద్యుల సలహా మేరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నవాజ్ షరీఫ్పై విష ప్రయోగం జరిగిందని, అందుకే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇక, విదేశాల్లో చికిత్సకు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం షరతులు విధించింది. ఐతే, కోర్టు పెరోల్ మంజూరు చేయడంతో మెరుగైన చికిత్స కోసం లండన్ తీసుకువెళ్లారు.